Share News

CM Revanth Reddy: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:54 AM

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

CM Revanth Reddy: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు..

  • రూ.241 కోట్ల ఖర్చుతో

  • 48 వేల ఎకరాలకు నీరు

  • అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి

  • త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్‌రెడ్డి సంకల్పం

  • తొలుత గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు

  • అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

  • వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు.. ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగు ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా.. గోదావరి, కృష్ణా బేసిన్‌లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్‌ శాఖ అధికారులు, ఇంజనీర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి.. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత త్వరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా గోదావరి బేసిన్‌ పరిధిలోని నీల్వాయి వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెంవాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజ్‌-2, సదర్మట్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని నిర్ణయించారు.


ఈ ప్రాజెక్టుల పనుల పూర్తికి దాదాపు రూ.241 కోట్ల మేర నిధులు ఖర్చవుతాయని, తద్వారా దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2025 మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. నీల్వాయి వాగు ద్వారా మంచిర్యాల జిల్లాలోని భూములకు సాగునీరు అందనుండగా, పింప్రి ఎత్తిపోతల పథకం, సదర్మట్‌ ప్రాజెక్టు ద్వారా నిర్మల్‌ జిల్లాకు, పాలెంవాగుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు స్టేజి-2తో వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది.


కాగా, గత ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్‌హౌ్‌సలకే పరిమితమయ్యాయని సీఎం అభిప్రాయపడినట్టు తెలిసింది. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించినా.. నీరు పారేందుకు అవసరమైన ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాలువలు నిర్మించలేదనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం.

Updated Date - Jul 08 , 2024 | 03:54 AM