Share News

Congress: హరితహారం.. ఇకపై ఇందిర వనప్రభ!

ABN , Publish Date - May 31 , 2024 | 03:20 AM

ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది.

Congress: హరితహారం.. ఇకపై ఇందిర వనప్రభ!

  • మొక్కలు నాటే కార్యక్రమం పేరును మార్చనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పేరు మార్చాలని భావించారు. ఈ క్రమంలోనే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కలుపుతూ ఇందిర వనప్రభగా ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా, 2004-14 మధ్యన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.


అప్పట్లో దీనికి ‘వన యజ్ఞం’ అని పేరు పెట్టారు. తాజా నిర్ణయంతో హరితహారం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌), ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) తదితర ఉన్నతాధికారుల హోదాకు ముందు ఇందిర వనప్రభ పేరును చేర్చనున్నారు. వర్షాకాలంలో ఈ కార్యక్రమం కింద మొక్కలు నాటి సంరక్షించడం, నర్సరీలను ఏర్పాటు చేయడం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్ధలాల్లో నీడనిచ్చే మొక్కలను పెంచనున్నారు. కోతులు, ఇతర పక్షుల కోసం ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి ఆవరణలో పండ్లనిచ్చే మొక్కలు నాటడం, వాటిని పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడతారు. విద్యార్థులకు పచ్చదనం ప్రాధాన్యం వివరించనున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు ‘‘తెలంగాణకు హరితహారం’’ పేరుతో జరిగాయి.


ఇకపై ఇందిర వనప్రభ కింద కొనసాగనున్నాయి. కలప, పండ్లనిచ్చే మొక్కలు, ప్లాంటేషన్‌ నమూనాలకు ఏర్పాటు చేసిన బోర్డులూ మారనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపునకు సేకరిస్తున్న హరిత నిధి పేరును ఇందిర వనప్రభ నిధి కానుంది. ప్రజలు, ఉద్యోగుల ద్వారా విరాళాల రూపంలో వస్తున్న ఈ నిధులను జిల్లాకు ఒకటి చొప్పున సెంట్రల్‌ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ కోసం మొక్కల పెంపకం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూమిలో వనాల పెంపకానికి ఖర్చు చేస్తున్నారు. ప్రతి రూపాయికి పక్కా లెక్క, జవాబుదారీతనంతో పనులు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. కేటాయింపులు, ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని గతంలో ప్రయత్నాలు జరిగాయి.

Updated Date - May 31 , 2024 | 03:20 AM