Share News

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:44 AM

రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

  • రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే

  • చిన్న, సన్నకారు రైతులకే రుణమాఫీ

  • ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారికీ పథకం వర్తింపు

  • రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు

  • ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా

హైదరాబాబాద్‌, జులై 10 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విధివిధానాలు ఖరారుచేసి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ నివేదికలో పలురకాల ప్రతిపాదనలను వ్యవసాయశాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది? పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నవారెందరు? అనే వివరాలకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే! ఆ వివరాలు ఢిల్లీ నుంచి వచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయశాఖ ఉంచినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను మినహాయించారు.


ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి.. పన్ను చెల్లించేవారికి రుణమాఫీ వర్తింపజేయాల్సిన అవసరంలేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మానం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్నారు. ఇలాంటివారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిఽధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మునిసిపల్‌ చైౖర్మన్లు... తదితర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటంలేదు. అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి.. ఎక్కువ జీతం తీసుకునేవారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే... వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలుచేసిన సందర్భంలో ఈ నిబంధన లేదు.


నిర్ణీత గడువు, కటాఫ్‌ అమౌంట్‌ పెట్టుకొని రుణమాఫీ చేశారు. దాంతో కొందరు బడా బాబులు, భూస్వాములకు కూడా రుణమాఫీ పథకం వర్తించింది. అలాంటివారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింపజేస్తే... ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, చిన్న, సన్నకారు రైతులు, అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాగా రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదలచేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తాజాగా ప్రకటించారు. దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు-15 డెడ్‌లైన్‌గా పెట్టుకున్న విషయం విదితమే! ఈ రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలతో కూడా జీవో విడుదలైతే... పథకాన్ని అమలుచేయటానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది.


రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనా ఉండగా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు సమకూర్చింది. మరో రెండు, మూడు వారాల్లో రుణమాఫీకి సరిపడా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. మరోవైపు ‘నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌’(ఎన్‌ఐసీ)లో... బ్యాంకర్లు, పీఏసీఎ్‌సల నుంచి వచ్చిన రైతులు, రైతుకుటుంబాలు, అప్పుల జాబితాను జల్లెడ పడుతున్నారు. రేషన్‌కార్డు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రైతు కుటుంబాలను డిసైడ్‌ చేస్తున్నారు. ఆధార్‌ కార్డుల ఆధారంగా నంబర్లను సరిపోలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం మార్గదర్శకాలపై కసరత్తు పూర్తిచేసేలోపు... ఎన్‌ఐసీలో డేటా ప్రాసెసింగ్‌ ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

Updated Date - Jul 11 , 2024 | 02:44 AM