Share News

CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:19 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన పలు అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ(శనివారం) సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా, లేదా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన పలు అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ(శనివారం) సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా, లేదా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విభజన సమస్యలకు ముగింపు పలికేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.


సమావేశంలో చర్చించే 10అంశాలు ఇవే..!

ఏపీ విభజన చట్టం 9వ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న 23సంస్థల పంపిణీ, 10వ షెడ్యూల్‌లో పెండింగ్‌లోని 30సంస్థల పంపిణీపై చర్చించనున్నారు. అలాగే షీలా బీడే కమిటీ సిఫార్సులపైనా చర్చ సాగనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన రూ.7,200వేల కోట్ల విద్యుత్ బకాయిలపైనా, ఏపీఎఫ్సీ అంశాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఉద్యోగుల పరస్పర బదిలీ, లేబర్ సెస్ పంపకాలు.. ఏపీ, తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చులు చెల్లింపులపైనా చర్చిస్తారు. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య 10ఏళ్లుగా సంస్థల విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలు సంస్థలకు చెందిన రూ.8వేల కోట్లు రెండు రాష్ట్రాలూ వాడుకోలేకపోతున్నాయి. 9వ షెడ్యూల్‌లోని ఏపీ జెన్కో విలువ రూ.2,448కోట్లుగా నిర్ధారించారు. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది. 10వ షెడ్యూల్‌లోని సంస్థల్లోనూ రూ.2,994కోట్ల నగదు ఉంది. అందులోని రూ.1,559కోట్లను ఇప్పటికే రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. మిగిలిన రూ.1,435కోట్ల పంపిణీ అంశం పెండింగ్‌లో పడింది. దీంతో ఆ అంశాలన్నింటిపైనా చర్చ జరగనుంది.


తెలంగాణ తరఫున ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన7మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చడం, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకవర్గంలో తెలంగాణకు ప్రాధాన్యత, అలాగే దర్శనాల్లోనూ స్పెషల్ కోటాపై చర్చించనున్నారు. కృష్ణా జలాల్లో 811టీఎంసీల నీటిలో తెలంగాణకు 558టీఎంసీలు కేటాయింపుపై చర్చిస్తారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ సంస్థలు చెల్లించాల్సిన రూ.24,000 కోట్ల బకాయిలు చెల్లింపుపైనా మాట్లాడనున్నారు. తెలంగాణకు పోర్టులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతుల్లో కోటా ఇవ్వాలనే డిమాండ్‪పైనా చర్చ జరగనుంది.


భేటీలో పాల్గొనేది వీరే..

రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు ఇవాళ(శనివారం) ప్రజాభవన్‌లో సాయంత్రం 6గంటలకు నిర్వహించే భేటీలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, సీఎస్‌లు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఐఏఎస్‌లు, వివిధ శాఖల ప్రధాన అధికారులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. చర్చలు అనంతరం ఏపీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అందరికీ సీఎం రేవంత్ రెడ్డి విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jul 06 , 2024 | 04:19 PM