Share News

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్

ABN , Publish Date - Aug 31 , 2024 | 09:25 PM

తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వానల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రభుత్వం యంత్రాంగం అలర్ట్

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వానల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు(శనివారం) జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

డీజీపీ డా. జితేందర్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా, మున్సిపల్ పరిపాలన విభాగం సంచాలకులు గౌతమ్‎లు కూడా ఈ టెలీకాన్ఫరెన్స్‎లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్‎లను తెరవాలని సూచించారు.

లోతట్టు, వరద ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లకుండా తగిన విధంగా నిఘా పెట్టాలని అన్నారు. ముఖ్యంగా ఉధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలనుంచి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.


భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని తాగునీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవడంతోపాటు, అంటూ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్‎లను చేపట్టాలని తెలిపారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను సిద్ధంగా ఉంచామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్, విజయవాడలలో ఉన్నాయని, ఏవిధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృదాలను పంపిస్తామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


భారీ వరదలు, వర్షాల వల్ల కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పడే అవకాశం ఉందని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈవిధమైన చర్యలను పాల్పడకుండా నీటిపారుదల శాఖ అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‎లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మ్యా‎న్ హోళ్లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయాలు, ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని, అన్ని కమిషనరేట్లు, ఎస్పీ‎ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‎లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు.

Updated Date - Aug 31 , 2024 | 09:25 PM