Share News

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:36 AM

బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు.

Karimnagar: సంజయ్‌కుమార్‌ చేరికపై జీవన్‌రెడ్డి కినుక

  • జీవన్‌రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్‌బాబు

  • తొందరపాటు నిర్ణయాలు వద్దని వినతి

  • చేరికల్లో సమన్వయ లోపం జరిగింది

  • జీవన్‌రెడ్డి ప్రాధాన్యం తగ్గదు: దుద్దిళ్ల

  • కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి

  • అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కరీంనగర్‌/జగిత్యాల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చు కోవడంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కినుక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురై రాజీనామాకు సిద్ధమయ్యారు. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తనను మాటమాత్రంగానైనా సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది తనను అగౌరవపరిచినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జగిత్యాల కాంగ్రెస్‌ నాయకులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వందలాది కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం సోమవారం ఉదయమే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఉండి జీవన్‌రెడ్డి ఆవేదనలో పాలుపంచుకున్నారు.


ఈ క్రమంలోనే ఒకరిద్దరు సీనియర్‌ నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి లేఖలు పంపించినట్లు ప్రకటించారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి జీవన్‌రెడ్డిని సముదాయించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. సోమవారం మధ్యాహ్నం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, మరో ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్‌ జీవన్‌రెడ్డిని కలిసి ఆయనకు నచ్చజెపుతూ తొందరపాటు నిర్ణయం ఏదీ తీసుకోవద్దని కోరినట్లు తెలిసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన పార్టీ అధినాయకత్వం మంత్రి శ్రీధర్‌బాబును దూతగా పంపగా.. సాయంత్రం 6.30గంటలకు ఆయన జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చారు.


ఈ సమయంలో కాంగ్రె్‌సశ్రేణులు, నేతలు జీవన్‌రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, కోరుట్ల ఇన్‌చార్జి నర్సింగరావు తదితరులు జీవన్‌రెడ్డితో చర్చించి ఆయనకు నచ్చజెప్పారు. వ్యక్తికి గౌరవం లేకపోతే ప్రజా జీవితం ఎందుకు? పదవి ఎందుకు? అని జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాను ఇంతకాలం పార్టీలో గౌరవంగా కొనసాగానని గుర్తు చేసినట్లు సమాచారం.


పార్టీకి పెద్ద దిక్కు జీవన్‌రెడ్డి: దుద్దిళ్ల

చర్చల అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కు అని, చేరికల విషయంలో కొంత సమన్వయ లోపం జరిగిందని తెలిపారు. జీవన్‌రెడ్డి మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటామని, ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో మాదిరిగానే ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సంఘటన కారణంగా మనస్తాపానికి గురైనట్లు జీవన్‌రెడ్డి వివరించారని, అన్ని విషయాలను అధిష్ఠానానికి తెలియజేస్తానని తెలిపారు. అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జరిగిన పరిణామాలపై శ్రీధర్‌బాబుతో చర్చించానన్నారు. కాంగ్రెస్‌ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీ నిబంధనల్ని పాటిస్తానని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చేరిక వెనుక రాజకీయం

పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన జీవన్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. ఆయన్ను గెలిస్తే నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటారన్న ఉద్దేశంతో అక్కడి నాయకులు ఆయనకు సహకరించలేదన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న నాయకుడికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో సాన్నిహిత్యం ఉంది. కాంగ్రె్‌సలో చేరేలా సంజయ్‌ను ఆయనే ఒప్పించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్‌ దక్కుతుందని నమ్మబలికినట్లు సమాచారం. సంజయ్‌కుమార్‌ కూడా అధికార పార్టీలో ఉంటేనే మేలనే భావనకు వచ్చారని తెలిసింది.

Updated Date - Jun 25 , 2024 | 03:36 AM