Share News

Nalgonda: ప్రాజెక్టులపై పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:13 AM

లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం, మూసీ కాల్వల వంటి ప్రాజెక్టులపై పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.

Nalgonda: ప్రాజెక్టులపై పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

  • ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టే నిదర్శనం: భట్టి

  • మంత్రులతో కలిసి ప్రాజెక్ట్‌ సందర్శన

  • 2027లోగా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి: ఉత్తమ్‌

నల్లగొండ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం, మూసీ కాల్వల వంటి ప్రాజెక్టులపై పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. నల్లగొండ-నాగర్‌కర్నూల్‌ జిల్లాల సరిహద్దు మన్నెవారిపల్లి సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌లెట్‌ను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌తో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడే ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖాధికారులతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులు, కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.


బీఆర్‌ఎస్‌ హయాంలో కనీసం కిలోమీటర్‌ సొరంగం పనులు కూడా సాగలేదని ఆరోపించారు. సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రాజెక్టు వ్యయం మూడురెట్లు పెరిగిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల, మూసీ కాల్వలతో పాటు నిర్మాణంలో ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలు నిర్ణీత గడువులో పూర్తయ్యేందుకు నిధులిస్తామని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని సెప్టెంబరు 2027 నాటికి పూర్తిచేస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. అంచనా వ్యయం పెంపును క్యాబినెట్‌లో ఆమోదిస్తామన్నారు. డిండి ఎత్తిపోతలకు సంబంధించి ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకునే పనులను తక్షణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉదయసముద్రం-బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల, దేవరకొండ, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ఎత్తిపోతలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


  • శ్రద్ధతో పనిచేస్తున్నాం: కోమటిరెడ్డి

పాపాత్ముడి పాలనలో నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదని, అందుకే ఓటమిపాలై ఇంట్లో కూర్చున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక ఎస్‌ఎల్‌బీసీ మొదలు అన్ని ప్రాజెక్టులపై శ్రద్ధపెట్టి పనిచేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయడంతో పాటు, బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ సీసీలైనింగ్‌కు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.


  • అంచనా వ్యయం రూ.4637 కోట్లకు పెంపు

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను సొరంగం ద్వారా తరలించడానికి ఉద్దేశించిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ నిర్మాణ అంచనా వ్యయం రూ.3150 కోట్ల నుంచి రూ.4637 కోట్లకు పెరిగింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం భట్టి, ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి ప్రాజెక్టును పరిశీలించగా.. సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర పడింది.

Updated Date - Sep 21 , 2024 | 03:13 AM