Gorantla Madhav : వీడియో నాదే.. ఆడియో నాది కాదు
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:00 AM
పోక్సో కేసులో బాధితుల వివరాలు వెల్లడించడంపై నమోదైన కేసులో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడలో పోలీసుల విచారణకు హాజరయ్యారు.

పోలీసు విచారణలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
పోక్సో చట్టంపై కొంతే అవగాహన ఉందని వెల్లడి
విజయవాడ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో బాధితుల వివరాలు వెల్లడించడంపై నమోదైన కేసులో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైం ఇన్స్పెక్టర్లు బి.గుణరాము, పలివెల శ్రీనివాసరావు మాధవ్ను విచారించారు. 10 నుంచి 15 ప్రశ్నలను సంధించారని తెలిసింది. మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో చూపించి ఇది మీదేనా అని పోలీసులు ప్రశ్నిస్తే.. అత్యాచార బాధితుల గురించి మాట్లాడిన వీడియో తనదేనని, అందులో ఉన్న ఆడియో మాత్రం తనది కాదని మాధవ్ చెప్పినట్టు తెలిసింది. ‘ఇంతకుముందు పంపిన నోటీసు అందిందా..’ అన్న ప్రశ్నకు తాను ఆ చిరునామాలో ఉండడం లేదని మాధవ్ బదులిచ్చారు. ‘పోక్సో చట్టంపై అవగాహన ఉందా..’ అని ప్రశ్నించగా.. కొంతవరకు అవగాహన ఉందని సమాధానమిచ్చారు. మళ్లీ విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని పోలీసులు బీఎన్ఎ్సఎస్ 35(3) కింద నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం మాధవ్ అరెస్టయినట్టేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణ అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి పద్మ ఇంతకుముందు చంద్రబాబు, పవన్, లోకేశ్పైనా ఫిర్యాదు చేశారన్నారు. దానిపైనా కేసు నమోదు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తానూ ఫిర్యాదు చేస్తానన్నారు. కాగా, మాధవ్ వెంట వచ్చిన వైసీపీ న్యాయవాదులంతా పోలీస్ స్టేషన్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కరినే అనుమతిస్తామని చెప్పగా, అందర్నీ పంపాలని వాగ్వాదానికి దిగారు. తర్వాత మాధవ్తోపాటు ఇద్దరు న్యాయవాదులను అనుమతించారు.