KOllu Ravindra: ఆ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తే వదలం.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:18 PM
KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(బుధవారం) మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి కొల్లు రవీంద్ర వినితులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు. జగన్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఏపీలో బటన్ నోక్కే సీఎం పోయి అభివృద్ధి కాంక్షించే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. జగన్ మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పోయిందని ఆరోపించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. బర్డ్ ఫ్లూపై సీఎం చంద్రబాబు నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని.. అలా చేస్తే వదలబోమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.