Aravind Srinivas Nandan Nilekani: భారత్కు ఆ ఏఐ మోడళ్లు అవసరం లేదన్న నీలేకని.. ఆ భావన తప్పన్న పర్ప్లెక్సిటీ సీఈఓ!
ABN , Publish Date - Jan 23 , 2025 | 08:57 PM
ఏఐ విషయంలో భారత్ అనుసరించాల్సిన పంథాపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చేసిన సూచనలతో పర్ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ విభేదించారు. ఇలా ఆలోచనతో భారత్ ఏఐ రంగంలో వెనకబడే అవకాశం ఉందని అన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, యూపీఐ, ఆధార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నందన్ నీలేకని ఇటీవల ఏఐ విషయంలో భారత సంస్థలు అనుసరించాల్సిన పంథాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, పర్ఫ్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ మాత్రం ఆయన అభిప్రాయంతో విభేదించారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా అరవింద్ తన మనసులో మాటను పంచుకున్నారు. భారతీయ సంస్థలు భారీ ఎల్ఎల్ఎమ్ ఏఐ మోడళ్ల (చాట్జీపీటీ లాంటివి) అభివృద్ధిపై దృష్టిపెడుతూనే వాస్తవ అవసరాలను అవసరమైన ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు (Viral).
‘‘నందన్ నీలేకని అద్భుతమైన వ్యక్తి. మేమెవరం ఊహించలేని స్థాయిలో ఆయన ఇన్ఫోసిస్, యూపీఐ ద్వారా దేశానికి ఎంతో సేవ చేశారు. కానీ భారతీయులు ఏఐ మోడల్ ట్రెయినింగ్ నైపుణ్యాలను పక్కనపెట్టి ప్రస్తుతమున్న మోడళ్ల ఆధారంగా ఇతర ఏఐ అప్లికేషన్లు డిజైన్ చేయాలన్న ఆయన సూచన మాత్రం తప్పు. రెండిటిపైనా దృష్టి పెట్టాలి’’ అని అన్నారు (Aravind Srinivas Nandan Nilekani).
‘‘పర్ప్లెక్సిటీ నిర్వహణ సందర్భంగా మేము ఎదుర్కొన్న ట్రాప్లోనే భారత్ పడినట్టు నాకు అనిపిస్తోంది. భారీ ఎల్ఎల్ఎమ్ మోడళ్ల అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నదని మేము అనుకున్నాము. అయితే, ఏఐ రంగంలో భారతీయ సంస్థల ఇస్రో లాంటి ఫీట్ను సాధించాలి. ఎలాన్ మస్క్ కూడా బ్లూ ఆరిజిన్ను కాదని ఇస్రోను ప్రశంసించారు. తక్కువ ఖర్చుతో లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఆయన ప్రశంసిస్తారు. ఏఐ రంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపే టీం కోసం మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి నా సమయంలో వారానికి ఐదు గంటలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అరవింద్ శ్రీనివాస్ అన్నారు.
Vasectomy Gift for Wife: భార్యకు బహుమతిగా వేసక్టమీ ఆపరేషన్ చేసుకున్న డాక్టర్! వీడియో నెట్టింట వైరల్!
అంతకుమునుపు, మెటా ఏఐ సమ్మిట్లో పాల్గొన్న నందన్ నీలేకని ఏఐ విషయంలో భారత సంస్థ అనుసరించాల్సిన పంథాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘మరో ఎల్ఎల్ఎమ్ను నిర్మించడం మన లక్ష్యం కాకూడదు. భారీగా నిధులు మళ్లించగలిగే సిలికాన్ వ్యాలీ సంస్థలకు ఆ పని వదిలిపెడదాం. మనం మాత్రం సింథటిక్ డాటాతో చిన్న లాంగ్వేజ్ మోడళ్లను వేగంగా నిర్మించి, వాటికి తగిన డేటాతో శిక్షణ ఇద్దాం’’ అని అన్నారు. ఇండియాకు అవసరమైన ఏఐ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో నిర్మించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. అయితే, ఈ సూచనతో అరవింద్ విభేదించారు. భారీ ఖర్చవుతుందన్న పొరపాటు పడి వెనకడుగు వేస్తే భారత్ వెనకబడిపోవచ్చని అన్నారు.