IPL 2025 Expensive Players: కోట్లు తీసుకొని కొంపముంచుతున్నారు.. ఏంది సామి ఇది
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:29 PM
Today IPL Match: కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీల కొంపముంచుతున్నారు. ఆరంభ మ్యాచుల్లో అట్టర్ఫ్లాప్ అవడంతో బోణీ కొట్టడంలో టీమ్స్ దెబ్బతిన్నాయి. ఆయా ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

మెగా ఆక్షన్లో ఒక్కో ఆటగాడ్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తమ జట్టు తలరాత మారుస్తాడని నమ్మి కొందరిపై కోట్లు కుమ్మరించాయి. కానీ ఏం లాభం.. సీజన్ ఆరంభంలోనే ఆటగాళ్లు తుస్సుమంటున్నారు. టీమ్పై కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. రిషబ్ పంత్ నుంచి రింకూ సింగ్ వరకు, వెంకటేశ్ అయ్యర్ నుంచి జోఫ్రా ఆర్చర్ దాకా పలువురు ఎక్స్పెన్సివ్ ప్లేయర్లు టీమ్స్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ల కోసం ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం ఎంత.. కొత్త సీజన్లో వాళ్ల ఆటతీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
రిషబ్ పంత్
వేలంలో రూ.27 కోట్ల భారీ ధరకు పంత్ను దక్కించుకుంది లక్నో సూపర్ జియాంట్స్. వచ్చీ రాగానే కెప్టెన్సీ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసింది. కానీ లక్నోతో జరిగిన తొలి మ్యాచ్లో పంత్ డకౌట్ అయ్యాడు. కీపింగ్లోనూ కీలక సమయంలో ఓ స్టంపౌంట్ మిస్ చేశాడు. సారథిగానూ సరైన నిర్ణయాలు తీసుకోలేక జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారాడు.
వెంకటేశ్ అయ్యర్
వెంకీ అయ్యర్ను రూ.23.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది కేకేఆర్. కానీ అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. తొలి మ్యాచ్లో 6 పరుగులే చేసి తుస్సుమన్నాడు.
రింకూ సింగ్
పించ్ హిట్టర్ రింకూను రూ.13 కోట్లు పెట్టి రీటెయిన్ చేసుకుంది కోల్కతా. కానీ అతడు మొదటి మ్యాచ్లో 12 పరుగులే చేసి వెనుదిరిగాడు.
జోఫ్రా ఆర్చర్
స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు)ను ఏరికోరి మరీ వేలంలో కొనుక్కుంది రాజస్థాన్ రాయల్స్. కానీ సన్రైజర్స్తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో అతడు 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చుకున్నాడు. లీగ్ హిస్టరీలో భారీ పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
శివమ్ దూబె
ప్రముఖ ఆల్రౌండర్ శివమ్ దూబె (రూ.12 కోట్లు)ను రీటెయిన్ చేసుకుంది సీఎస్కే. కానీ అతడు మొదటి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. 9 పరుగులే చేసి కుర్ర స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్కు అడ్డంగా దొరికిపోయాడు.
ఆండ్రూ రస్సెల్
కరీబియన్ స్టార్ రస్సెల్ (రూ.12 కోట్లు) కూడా తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేదు. కేకేఆర్ అతడి మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 4 పరుగులే చేసి వికెట్ పారేసుకున్నాడు. కీలక సమయాల్లో బ్రేక్త్రూలు ఇచ్చే రస్సెల్.. ముంబైతో మ్యాచ్లో బౌలింగ్కే దిగలేదు.
న్యాయం చేస్తారా..
ఐపీఎల్ కొత్త సీజన్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ఇంకా బోలెడు మ్యాచులు ఉన్నాయి. కాబట్టి ప్లేయర్ల ఫెయిల్యూర్ గురించి అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మూమెంటమ్ అందుకోకపోతే ప్రెజర్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల పెర్ఫార్మ్ చేయడం ఇంకా క్లిష్టతరం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. కోట్లు తీసుకుంటున్న స్టార్లు ఆ ధరకు మున్ముందు న్యాయం చేస్తారేమో చూడాలి.
ఇవీ చదవండి:
ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
ఉప్పల్ స్టేడియానికి థమన్.. దుమ్ములేపేలా..
పంత్ వర్సెస్ లక్నో ఓనర్.. ఏం జరిగిందంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి