Road Accidents: రోడ్డు ప్రమాదాలు.. 75 మందికి గాయాలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 05:59 PM
Road Accidents: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 75 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

ఆదిలాబాద్, జనవరి 19: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్నూర్ మండలం కొత్తపల్లి సమీపంలో భక్తులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులతోపాటు స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. కోమరం భీం జిల్లాలోని జంగు బాయి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరిమితికి మించి భక్తులు ఎక్కడం వల్లే వ్యాన్ అదుపు తప్పి.. బోల్తా పడిందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 40 మంది భక్తుల్లో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ తరలించేందుకు వైద్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ జాతరలో మొక్కులు చెల్లించుకొనేందుకు భక్తులు వెళ్తుండగా..ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు వివరించారు.
ఘట్ కేసర్లో..
ఇక మేడ్చల్ మల్కాజ్గరి జిల్లాలోని ఘట్ కేసర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తు్న్న డీసీఎం వాహనం.. ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్ కారణంగానే.. ఈ వ్యాన్ అదుపు తప్పి.. బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా ఏడుగురికి తీవ్ర గాయాలు పాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా ఉప్పునూతల వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.
For Telangana News And Telugu News