Pragnanandaa: వరల్డ్ కప్‌ చెస్‌లో అదరగొట్టిన ప్రజ్ఞానంద.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2023-08-28T20:12:24+05:30 IST

ప్రపంచకప్ చెస్ టోర్నీలో రాణించిన ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని తెలిపారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.

Pragnanandaa: వరల్డ్ కప్‌ చెస్‌లో అదరగొట్టిన ప్రజ్ఞానంద.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

చెస్‌ వరల్డ్‌ కప్‌లో భారత యంగ్ గ్రాండ్‌ మాస్టర్‌ రమేష్‌బాబు ప్రజ్ఞానంద అనూహ్యంగా రాణించాడు. 18 ఏళ్ల వయసులోనే తన అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు వెళ్లాడు. అయితే ఫైనల్లో అనుభవజ్ఞుడు, నార్వే నంబర్‌వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓడిపోయాడు. 36 ఏళ్ల కార్ల్‌సన్ విజేతగా నిలిచినా.. ప్రజ్ఞానంద అంత ఈజీగా లొంగిపోలేదు. వరుసగా రెండు ఆటలను డ్రా చేసుకుని టై బ్రేక్‌ వరకు తీసుకెళ్లాడు. టై బ్రేక్ గేమ్‌లో తడబడిన ప్రజ్ఞానంద ఒత్తిడికి లోను కావడంతో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయినా ప్రజ్ఞానందపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 18 ఏళ్లకే వరల్డ్ కప్ చెస్ టోర్నీలో ఫైనల్ చేరిన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్ ఉందని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ప్రజ్ఞానందను కొనియాడారు. అతడికి ఈ ఓటమి ఓ గుణపాఠం మాత్రమే అని తెలిపారు. తన దృష్టిలో ప్రజ్ఞానంద రన్నరప్ కాదని.. అతడు భవిష్యత్‌లో సాధించే గోల్డ్ మెడల్, మరిన్ని విజయాలకు ఫైనల్లో ఎదురైన ఓటమి కావాల్సిన గుణపాఠాన్ని నేర్పుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు X (గతంలో ట్విట్టర్)లో చాలా మంది నెటిజన్‌లు ప్రజ్ఞానందకు బహుమతి ఇవ్వాలని కోరారు. ఈ ట్వీట్లకు స్పందించిన ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానందకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రజ్ఞానందకు ఇంకా చిన్నవయసే కావడంతో అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి: RCB: రజనీ ‘జైలర్’ సినిమాపై ఆర్సీబీ అభ్యంతరం.. సీన్ తొలగించాలని కోర్టు ఆదేశాలు

నెటిజన్‌ల సూచనను పరిగణనలోకి తీసుకున్నానని.. చాలా మంది ప్రజ్ఞానందకు కారు బహుమతిగా ఇవ్వమని ప్రోత్సహించారని.. కానీ తనకు మరో ఆలోచన ఉందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. తాను ప్రజ్ఞానంద తల్లిదండ్రులను ప్రోత్సహించాలని భావిస్తున్నాని.. పిల్లలకు చెస్ నేర్పించడంలో వారు ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు. వీడియో గేమ్‌లు ఆడుతున్న చిన్నారులు ఉన్న ఈ కాలంలో వాళ్లకు చెస్ పట్ల అవగాహన కల్పించి మద్దతు కల్పించిన శ్రీమతి నాగలక్ష్మీ, రమేష్‌బాబు దంపతులకు ఎలక్ట్రిక్ కారును ఇస్తున్నట్లు వివరించారు. తమ కుమారుడి అభిరుచి తెలుసుకుని ప్రోత్సాహం అందించి నిరంతర సహాయం చేసి ఈ స్థాయికి తెచ్చినందుకు ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-28T20:12:24+05:30 IST