Dhoni Birthday: మిడిల్ క్లాస్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా..!!

ABN , First Publish Date - 2023-07-07T13:05:05+05:30 IST

ధోనీ ఈరోజు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రాంచీలో ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన అతడు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నాడు. ఆటతీరుతో, వ్యక్తిత్వంతో అందరికీ మార్గదర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.

Dhoni Birthday: మిడిల్ క్లాస్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా..!!

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీ అంటే పేరు కాదు ఒక బ్రాండ్. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా ధోనీ అంటే క్రేజ్ తగ్గలేదు. టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ అతడే. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఏ భారత కెప్టెన్‌కు సాధ్యపడని రీతిలో మూడు ఐసీసీ టైటిళ్లను అందించాడు.

ఇంతగా స్టార్ ఇమేజ్ సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ధోనీ నేపథ్యం పెద్ద గొప్పదేమీ కాదు. రాంచీలో ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన అతడు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నాడు. ఆటతీరుతో, వ్యక్తిత్వంతో అందరికీ మార్గదర్శకుడిగా మారాడు.

ధోనీది చాలా మాములు మధ్యతరగతి కుటుంబం. ఇల్లు కూడా చాలా ఇరుకుగా ఉండేది. క్రికెట్ అంటే ఎంత ఇష్టం ఉన్నా తన కుటుంబ నేపథ్యం, తండ్రి పడుతున్న కష్టాలు చూడలేక క్రీడల కోటాలో ధోనీ ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. అయితే కొన్నాళ్లకు పరిస్థితులు చక్కపడటంతో క్రికెట్ వైపు మక్కువ చూపించాడు. అలా 2004లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. గోల్డెన్ డకౌట్‌తో కెరీర్ ప్రారంభించినా కొద్దికాలంలో తనకంటూ ఓ ముద్ర వేసుకునే స్థాయిలో దూసుకెళ్లాడు. పాకిస్థాన్‌పై భారీ సెంచరీ ధోనీ కెరీర్‌ను మలుపు తిప్పింది. జట్టులో ఫినిషర్‌గా స్థానం సుస్థిరం చేసుకుంటున్న దశలోనే కెప్టెన్సీ పదవి రావడంతో టీమ్‌పై తన మార్క్ చూపించాడు. యువకులకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు. 2007లో ఎలాంటి అంచనాలు లేని సమయంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు. అంతేకాకుండా టెస్టుల్లో, వన్డేల్లో టీమిండియాను నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత ధోనీదే.

ఇది కూడా చదవండి: అప్‌డేట్.. ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్

స్టార్ ఇమేజ్ కొనసాగుతున్న సమయంలోనే 2020లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని సుమారు మూడేళ్లు దాటినా ధోనీ మార్కెట్ పడిపోలేదు. విరాట్ కోహ్లీ తర్వాత ఇండియన్ క్రికెట్‌లో అత్యధిక ఎండార్స్‌మెంట్స్ కలిగిన క్రికెటర్ ధోనీనే. డ్రీమ్ ఎలెవన్, గోడాడీ, ఒరియో బిస్కెట్స్, ఇండియా సిమెంట్స్, టీవీఎస్, ఒప్పో వంటి కంపెనీలకు ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నాడు. మరోవైపు బిజినెస్‌లోకి కూడా దిగి తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ గరుడా ఎయిర్ స్పేస్‌లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. ధోనీ బయోపిక్ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా లాభాల్లో రూ.30 కోట్లు తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తమిళంలో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కాగా ధోనీ ఈరోజు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతడు మరిన్ని బర్త్ డేలు జరుపుకోవాలని అభిమానులు మనసారా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ధోనీ ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.

Updated Date - 2023-07-07T13:06:01+05:30 IST