Share News

HYD: తీగల ‘కాళ్లకు’ ఇబ్రహీంపట్నం ‘బంధం’

ABN , First Publish Date - 2023-10-26T07:51:33+05:30 IST

మహేశ్వరం టికెట్‌ తనకే ఇవ్వాలని, సబితారెడ్డికి ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసి

HYD: తీగల ‘కాళ్లకు’ ఇబ్రహీంపట్నం ‘బంధం’

సరూర్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మహేశ్వరం టికెట్‌ తనకే ఇవ్వాలని, సబితారెడ్డికి ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి(Former MLA Thigala Krishna Reddy) దూకుడుకు అధిష్టానం పెద్దలు ‘ఇబ్రహీంపట్నం బంధం’ వేశారు. ఆయన వల్ల తనకు ప్రచారంలో ఇబ్బందులు తప్పవని భావించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి(Minister Sabita Reddy).. ఎన్నికల క్రతువు ముగిసేంత వరకు మహేశ్వరంలో ఆయన నీడ కనబడకుండా చూడాలంటూ పార్టీ పెద్దలను కోరినట్లు తెలిసింది. దీంతో నయానోభయానో ఆయనను బుజ్జగించిన అధిష్టానం.. చివరకు ‘ఎమ్మెల్సీ’ హామీతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించినట్టు తెలుస్తోంది. కొత్త బాధ్యతల నేపథ్యంలో ఆయనకు మహేశ్వరంలో తిరిగే అవకాశం లేకుండా పోయింది.

TEEGALA1.jpg

2018 ఎన్నికల్లో తనపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన సబితారెడ్డిని.. ఆ తర్వాత తనను సంప్రదించకుండానే బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని ఏకంగా మంత్రి పదవి సైతం కట్టబెట్టడం పట్ల తీగల ముందు నుంచీ అసంతృప్తిగానే ఉన్నారు. తన ఓటమికి కారణమైన సబితకు పార్టీలో పెద్దపీట వేయడం ఆయనకు రుచించలేదు. ఈ క్రమంలో మొదట్నుంచీ ఆయన సబితకు వ్యతిరేకంగానే ఉంటూ తరచుగా ఘాటైన ఆరోపణలు, విమర్శలతో వార్తల్లో నిలిచారు. తీగల కృష్ణారెడ్డి(Thigala Krishna Reddy) ఒక దశలో బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఏం జరిగిందో కానీ ఆయన పార్టీని వీడలేదు. ఈ ఎన్నికల్లో ఆయన కీలకంగా మారతారని భావించారు కానీ, నియోజకవర్గంలో ఆయన నీడపడకుండా కట్టడి చేశారని పార్టీ కేడర్‌ అంటోంది.

Updated Date - 2023-10-26T07:51:33+05:30 IST