CM Revanth Reddy: కాకా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Dec 22 , 2023 | 02:03 PM
హైదరాబాద్: కాకా 9వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగ్ లింగంపల్లిలోని డా.బీఆర్. అంబేద్కర్ కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా వర్ధంతి సందర్భంగా వారికివే తన నివాళులన్నారు.

హైదరాబాద్: కాకా 9వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా వర్ధంతి సందర్భంగా వారికివే తన నివాళులన్నారు. వివేక్, వినోద్లను చూసినపుడు తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారన్నారు. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదని, సమాజానికి ఎంత పంచామనేది కాకా సామాజిక బాధ్యత విధానమని కొనియాడారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమన్నారు.
దేశ నిర్మాణంలో కాకా తన సామాజిక బాధ్యతను నిర్వర్తించారని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చని.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటంవల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని.. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని, దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్కు అండగా ఉంటుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మేము అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత రెడ్డి స్పష్టం చేశారు.
