Share News

YS Jagan: జగన్ తిరుమల దర్శనంపై కొనసాగుతున్న ఉత్కంఠ..

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:21 PM

ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైందవ మతాన్ని పాటిస్తున్నవారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో ..

YS Jagan: జగన్ తిరుమల దర్శనంపై కొనసాగుతున్న ఉత్కంఠ..
YS Jagan

వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల దర్శనంపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైందవ మతాన్ని పాటిస్తున్నవారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో అధికారులు ఎవరూ జగన్‌ను డిక్లరేషన్ గురించి ఒత్తిడి చేయలేదు. దీంతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల దర్శనానికి వెళ్లారు. సంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు ఎవరైనా తిరుమలలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా సెప్టెంబర్ 28వ తేదీన తిరుమల శ్రీవారిని వైసీపీ అధ్యక్షులు దర్శించుకుంటారని ఆ పార్టీ నేతలు ప్రకటించడంతో ప్రస్తుతం డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..


డిక్లరేషన్ ఇవ్వాలంటూ..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదని, కాని పవిత్ర పుణ్యస్థలంలో సంప్రదాయాలను పాటించాలని కూటమి పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరితో పాటు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు సైతం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. జగన్ క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని తిరుమల అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. గతంలో జగన్ సంప్రదాయాలను పాటించలేదని, తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, భక్తుల మనోభవాలను ఆయన పట్టించుకోలేదని కూటమి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్


జగన్ ఎలా స్పందిస్తారు..

రాజకీయ పార్టీలతో పాటు హైందవ సంఘాలు సైతం తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్‌పై ఆ పార్టీ మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వివాదంలో వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తేనే జగన్ డిక్లరేషన్ ఇస్తారని చెప్పారు. జగన్ డిక్లరేషన్‌కు, లడ్డూ వివాదానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆ పార్టీ నేత వంగా గీత రెండింటికి ముడిపెట్టడం ద్వారా ప్రతి విషయాన్ని వైసీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోందని, భక్తుల విశ్వాసాలను గౌరవించడం లేదని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇతర మతస్తులు ఎవరైనా తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే విషయం తెలిసినా.. ఈ అంశాన్ని వైసీపీ ఎందుకు రాజకీయం చేస్తోందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారా.. డిక్లరేషన్ అడిగారనే నెపంతో.. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.


AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 26 , 2024 | 03:38 PM