Share News

Chandrababu-TDP: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు కీలక సూచనలు

ABN , Publish Date - Jun 17 , 2024 | 05:39 PM

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు.

Chandrababu-TDP: టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు కీలక సూచనలు

అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఐదేళ్లు పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని పల్లా శ్రీనివాస్‌తో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.


నమ్మకంతో అతిపెద్ద బాధ్యత ఇచ్చాం: చంద్రబాబు

‘‘సామర్థ్యంపై నమ్మకంతో అతిపెద్ద బాధ్యత నీకు అప్పగించాం. సమర్థమంతంగా నిర్వహించాలి. అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గరకు చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి తగు గౌరవం కల్పించాలి. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పరంగా, సీఎంగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే నెల నుంచి పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్‌ను కూడా పున:ప్రారంభించాలి’’ అని చంద్రబాబు సూచించారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన కార్యకర్తల్ని నియమించి గౌరవించాలని పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు చంద్రబాబు సలహా ఇచ్చారు. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పారు.


పల్లాకు లోకేశ్ కీలక సూచనలు..

చంద్రబాబుని కలిసిన అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ను కూడా పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకుగానూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘‘నాకంటే పెద్ద బాధ్యత మీపై ఉంచారు. ప్రతి క్షణం కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ తోడుగా నిలవాలి’’ అని పల్లాకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు స్తబ్దుగా ఉన్నారని, వారందరినీ క్రియాశీలకం చేయాల్సిన గురుతర బాధ్యత ఉందని లోకేశ్ గుర్తుచేశారు.

పార్టీ కార్యాలయంలో మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా ప్రతి మంత్రి కూడా నెలలో కనీసం ఒక రోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారని లోకేశ్ తెలిపారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాస్‌కు లోకేశ్ సూచించారు. పార్టీ అధినాయకత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఏం కావాలన్నా అందించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని లోకేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


గ్రామీణ స్థాయిలో పార్టీని బలపరుస్తా: పల్లా శ్రీనివాస్

పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం అనునిత్యం కష్టపడతానని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సీనియర్ల సలహాలతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటానని చెప్పారు.

For more AP News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 05:55 PM