Share News

Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు

ABN , Publish Date - Aug 16 , 2024 | 02:44 PM

ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు.

Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా, ఆగస్ట్ 16: కోల్‌కతాలోని ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై ఆందోళనకారుల దాడి ఘటనను కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందనేందుకు ఈ ఘటన నిదర్శనమని కోల్‌కతా హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.


హైకోర్ట్ కీలక ఆదేశాలు..

ఈ దాడి ఘటనకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని అటు పోలీసులను ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను శుక్రవారం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి వద్ద పోలీసు బలగాలున్నా ఈ విధంగా జరగడం ఏమిటని ప్రశ్నించారు.

ఇలా అయితే వైద్యులు భయపడకుండా ఏలా పని చేయగలుగుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం స్పష్టం చేశారు. ఏ కారణం చేతనైనా క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ ఆర్డర్‌లోని సెక్షన్ 144ని పాస్ చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

ఇంత ఘర్షణ జరుగుతున్నప్పుడు.. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి ఉండాల్సిందని జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం పేర్కొన్నారు. ఇక ఆసుపత్రిపై దాడి చేసిన దాదాపు ఏడు వేల మంది నడిచి వచ్చారా? అని ఈ సందర్భంగా జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం సందేహం వ్యక్తం చేశారు.


దుపరి విచారణ ఆగస్ట్ 21వ తేదీ.. మధ్యంతర నివేదిక ఆందజేయాలని సీబీఐకి ఆదేశాలు..

ఈ కేసు తదుపరి విచారణ ఆగస్ట్ 21వ తేదీన జరుగుతుందని జస్టిస్ టి.ఎస్. శివజ్జానం స్పష్టం చేశారు. ఆ రోజు.. ఈ దాడి వ్యవహారంపై వేర్వేరుగా అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులు, ఆసుపత్రి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ దాడికి దారి తీసిన పరిస్థితులను డ్యాకుమెంట్ రూపంలో అందజేయాలని పోలీసులను ఈ సందర్భంగా హిరణ్మయి భట్టాచార్య కోరారు. అలాగే ఆగస్ట్ 9వ తేదీన ఆర్ జీ కార్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి కేసు దర్యాప్తునకు సంబంధించిన మధ్యంతర నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా సీబీఐని సైతం కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.


నష్ట పరిహారం వద్దు.. న్యాయం కావాలి

మరోవైపు కుమార్తె హత్యాచార ఘటనపై ఆమె తండ్రి మరోసారి స్పందించారు. కుమార్తె మృతి కారణంగా తమకు నష్ట పరిహారం వద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో తమకు న్యాయం జరిగితే చాలని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన పోరాటానికి వారంతా కుటుంబ సభ్యులుగా బాసటగా నిలుస్తారని పేర్కొన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 02:45 PM