Share News

Delhi : మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులివ్వండి: సీతక్క

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:00 AM

తెలంగాణలో రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

Delhi : మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులివ్వండి: సీతక్క

న్యూఢిల్లీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రోడ్డు సౌకర్యం లేని 1270 ఆవాసాలకు, పీఎం జన్‌మన్‌ స్కీం కింద 164 ఏజెన్సీ గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్‌తో ఆయన కార్యాలయంలో సీతక్క భేటీ అయ్యారు. తెలంగాణలో రోడ్డు మార్గానికి నోచుకోని వందకుపైగా జనాభా ఉన్న మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల జాబితాను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు గతంలోనే సమర్పించినట్టు సీతక్క గుర్తు చేశారు. మొదటి దశ కింద ఏజెన్సీ గ్రామాల్లో చేపట్టబోయే రోడ్ల నిర్మాణానికిగాను రూ.66.85 కోట్ల నిధులు విడుదల చేయడానికి పరిపాలనపరమైన అనుమతులివ్వాలని కోరారు. కాగా, రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హమీ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు.

Updated Date - Jun 25 , 2024 | 04:09 AM