Share News

CM Revanth : ఆపరేషన్‌ మూసీ

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:23 AM

మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్‌ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్‌ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.

CM Revanth : ఆపరేషన్‌ మూసీ

  • 12 వేల కుటుంబాల తరలింపు

  • సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం

  • నిరాశ్రయులకు పక్కా ఇళ్లు

  • తరలింపు వేళ ప్రత్యేక ఆర్థిక సాయం

  • పట్టా భూములున్న వారికి పరిహారం

  • టీడీఆర్‌ బాండ్లు, ఉపాధి అవకాశాలు

  • ఇప్పటికే పూర్తైన ఇంటింటి సర్వే

  • నిధుల కోసం రుణం

  • ఎన్నికల నాటికి ప్రాజెక్టు పూర్తి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్‌ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్‌ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో బఫర్‌ జోన్ల లో నివసిస్తున్న 12 వేల కుటుంబాలను తరలించాల ని నిర్ణయించింది. అంతర్గతంగా చేసిన కసరత్తు ఇప్పటికే ఓ కొలిక్కి రాగా.. కార్యాచరణకు అవసరమయ్యే నిధులను రుణంగా తీసుకోవాలని భావిస్తోంది.


పూర్తయిన సర్వే..

అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీనది గండిపేట వరకు స్వచ్ఛంగానే ఉంటోంది. అక్కడి నుంచి ఘట్‌కేసర్‌ వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర ఆక్రమణలతో కుంచించుకుపోయింది. మురుగునీటితో కలుషితమవుతోంది. లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా.. మూసీ సుందరీకరణకు సిద్ధమైన రేవంత్‌ ముందు వేల కుటుంబాలను తరలించడం ఒక పెద్ద సవాలు గా ఉంది.

సర్వే దాదాపు పూర్తయినా.. కార్యాచరణకు నిధులు సమకూరితే.. చకచకా పనులు సాగిపోయే లా పక్కా ప్రణాళికను సిద్ధమైంది. మూసీ సుందరీకరణకు బఫర్‌ జోన్‌లో ఆక్రమణలను తొలగించడంతోపాటు.. కొంత భూసేకరణ అవసరం. ఈ నేపథ్యంలో అధికారులు బఫర్‌జోన్‌ను ఆక్రమించుకుని, నివసిస్తున్న కుటుంబాలెన్ని? నదిని ఆక్రమించిన కుటుంబాలెన్ని? సుందరీకరణకు అదనంగా ఎంత మేర భూసేకరణ అవసరం? అనే అంశాలపై సర్వే పూర్తి చేశారు.


తరలింపే అతి పెద్ద సవాలు

అధికారుల సర్వేలో.. మూసీ సుందరీకరణకు రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ మొదలు.. మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఘట్‌కేసర్‌ వరకు సుమారు 12 వేల కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని అంచ నా వేశారు.

ఈ ప్రక్రియ పూర్తయితేగానీ, అడుగు ముందుకు పడని పరిస్థితి..! ఈ నేపథ్యంలో ఎదుర య్యే సమస్యలేంటి? తెరపైకి వచ్చే డిమాండ్లు ఏమి టి? ఎలా సంసిద్ధమవ్వాలి? అనే అంశాలపై అధికారు లు దృష్టి సారించారు. ఎలాంటి వ్యతిరేకత ఎదురవ్వకుండా.. ఓ ప్యాకేజీని సిద్ధం చేశారని సమాచారం. తరలించాల్సిన కుటుంబాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను గుర్తించి, దారిద్య్రరేఖకు దిగువన, ఎగువన ఉన్న కుటుంబాల చిట్టాను సిద్ధం చేశారని తెలిసింది.


సంతృప్తికరమైన ప్యాకేజీతో..

సర్వేలో గుర్తించిన 12 వేల కుటుంబాలు.. ఇళ్లను, వాణిజ్య సముదాయాలను నిర్మించుకున్న భూములు వేర్వేరు కేటగిరీల్లో ఉన్నాయి. పట్టా భూములతో పాటు.. ప్రభుత్వ, దేవాదాయ, పట్టణ భూపరిమితి చట్టం, వక్ఫ్‌, అసైన్డ్‌, ఇనాం, మూసీ బఫర్‌జోన్‌ భూ ములు ఉన్నట్లుగా నిర్ధారించారు. సర్వేలో భాగంగా వాణిజ్య సముదాయాల్లో వ్యాపారులపైనా దృష్టి సా రించారని తెలిసింది. వారి వ్యాపార పరిధి ఎంత వర కు ఉంది? టర్నోవర్‌ ఎంత? అనే వివరాలను సేకరించారు. భూములు, వాణిజ్య సముదాయాల వారీగా తరలింపుపై సంతృప్తికరమైన ప్యాకేజీలతో ముందు కెళ్లాలని సర్కారు నిర్ణయించింది.

తరలింపు సమయంలో ఎదురయ్యే సవాళ్లు, కోర్టు కేసుల విషయంలోనూ ఎలా ముందుకు సాగాలి? అన్నదానిపై అధికా రులు పక్కా ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. ఈ క్ర మంలో ఇళ్లను పోగొట్టుకునే వారికి.. వారు ఉంటున్న ప్రాంతాల సమీపంలోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరికి టీడీఆర్‌ బాండ్లను ఇవ్వాలని నిర్ణయించింది.

వాణిజ్య సముదాయాల యజమానుల విషయంలోనూ ప్రత్యే క ప్యాకేజీతో ముందుకు వెళ్లనున్న ట్లు తెలుస్తోంది. సంతృప్తికరమైన ప్యాకేజీతో 12 వేల కుటుంబాలు స్వచ్ఛందంగా తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ ప్యాకేజీలకు, మూసీ సుందరీకరణకు కావాల్సిన నిధులను రుణాల రూపంలో స మకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి ఈ ఆపరేషన్‌ ను పూర్తిచేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Aug 28 , 2024 | 08:01 AM