Share News

Commercial Tax Scam: కమర్షియల్ టాక్స్ స్కామ్‌లో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:06 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై (GST Scam) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై (Former CS Somesh Kumar) పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు.

Commercial Tax Scam: కమర్షియల్ టాక్స్ స్కామ్‌లో మరో కీలక పరిణామం

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై (GST Scam) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై (Former CS Somesh Kumar) పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్‌రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదైంది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు.


సీఐడీకి బదిలీ..

ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కామ్‌లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సంబంధం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారుల చర్చలు జరిపారు. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. 75 మంది పన్ను చెల్లింపుదారులు కార్యకలాపాలు వివరాల ఉద్దేశ పూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా నిందితులు చేశారు. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కమర్షియల్ టాక్స్, ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను సైతం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్‌కి చేరేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రూప్ లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.


నకిలీ ట్యాక్స్‌..!!

సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీనిని కేంద్రం, వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50 శాతం మేర పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్‌ ఇన్వాయిస్‌లను సృష్టించారు. ప్రధానంగా 18% ట్యాక్స్‌ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్క్రాప్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయిస్‌‌లలో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు. కేవలం కాగితాల్లోనే సరఫరాలు ఉంటాయి.


జీఎస్టీ కౌన్సిల్‌ ఖాతాల నుంచి క్లెయిమ్‌

ఉదాహరణకు తెలంగాణలోని ఒక డీలరు పంజాబ్‌కు స్క్రాప్‌ను పంపించినట్లు ఇన్వాయిస్‌‌‌లు తయారు చేశాడు. పంజాబ్‌ వ్యాపారి ఆ ఇన్వాయిస్‌‌‌లను ఆధారంగా చేసుకుని 18% ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను జీఎస్టీ కౌన్సిల్‌ ఖాతాల నుంచి క్లెయిమ్‌ చేశాడు. ఈ సొమ్మును పంజాబ్‌ డీలరు, తెలంగాణ డీలరు పంచుకున్నారు. ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు, ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుక్కుని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ రూ.1000 కోట్లుగా ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు. ఈ కుంభకోణం జరిగిన తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ఫిబ్రవరి 22న పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.


సాఫ్ట్‌వేర్‌లో కీలక మాడ్యుల్‌ మాయం..

జీఎస్టీలో పన్ను ఎగవేతలు, బకాయిలు వంటివాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల కమిషనరేట్‌ ఓ ప్రైవేటు సంస్థతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించింది. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో కీలకమైన మాడ్యుల్‌ లేకపోవడం వెనకా.. పోలీసులు తాజాగా కేసు నమోదు చేసిన ఇద్దరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు వాణిజ్యపన్నుల కమిషనరేట్‌ అప్పట్లోనే గుర్తించింది. సాధారణంగా డీలర్లు తాము అమ్మిన వస్తువులకు ‘జీఎస్టీఆర్‌-1’ రిటర్నులు, ఆ తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు, చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి ‘జీఎస్టీఆర్‌-3బీ’ రిటర్నులను ఫైల్‌ చేయాలి. వస్తువులను కొన్న ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు జీఎస్టీఆర్‌-1తో పాటు ‘జీఎస్టీఆర్‌-2ఏ’ రిటర్నులను సమర్పించాలి. దీని ద్వారా ఎంత విలువైన వస్తువులను కొనుగోలు చేశారన్నది తేలుతుంది.

వస్తువులు అమ్మిన డీలరు జీఎస్టీఆర్‌-3బీని సమర్పిస్తేనే వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ వివరాలు వెల్లడవుతాయి. కానీ.. ఇక్కడి డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాల డీలర్లకు అమ్మినట్లు జీఎస్టీఆర్‌-1 రిటర్నులను మాత్రమే ఫైల్‌ చేశారు. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వస్తువులను కొనుగోలు చేసినట్లు జీఎస్టీఆర్‌-2తో పాటు జీఎస్టీఆర్‌-3బీని ఫైల్‌ చేశారు. దాంతో వారికి ఐటీసీని క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ఐటీసీని క్లెయిమ్‌ చేశారు. ఇలా రిటర్నులను ఫైల్‌ చేసినట్లు చూపారే తప్ప.. భౌతికంగా వస్తు సరఫరా జరగలేదు.


దొంగ ఇన్వాయిస్‌లు..

ఇక్కడి డీలర్లు జీఎస్టీఆర్‌-3బీని సమర్పించినట్లయితే ప్రభుత్వానికి జీఎస్టీని చెల్లించాల్సి ఉండేది. అసలు వస్తు రవాణా జరగనప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ని క్లెయిమ్‌ చేయడానికే వస్తు సరఫరా జరిగినట్లు దొంగ ఇన్వాయిస్‌లను సృష్టించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీల ఐజీఎస్టీ సంబంధిత జీఎస్టీఆర్‌-3బీని సమర్పించారా? లేదా? అన్నది గుర్తించే ‘మాడ్యూల్‌’ కమిషనరేట్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లేనట్లు తేలింది. రాష్ట్ర వస్తు సేవల పన్ను(ఎస్‌జీఎస్టీ), కేంద్ర వస్తు సేవల పన్ను(సీజీఎస్టీ)ల రిటర్నులను గుర్తించే మాడ్యూల్స్‌ను మాత్రమే సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చారు. ఐజీఎస్టీకి సంబంధించిన మాడ్యూల్‌ను పొందుపర్చకపోవడంతో ఇక్కడి డీలర్లు పన్ను సంబంధిత రిటర్నులను దాఖలు చేశారా? లేదా? అన్నదాన్ని సాఫ్ట్‌వేర్‌ గుర్తించడం లేదు.


కుంభకోణం వెలుగులోకి...

పర్యవసానంగా దొంగ ఇన్వాయిస్‌లతో ఐటీసీని కొల్లగొట్టినట్లు తేలింది. ఫిబ్రవరిలో ఈ కుంభకోణం బయటపడగానే.. అంతర్గత విచారణలో సదరు సాఫ్ట్‌వేర్‌ సంస్థతో ఆ మాడ్యూల్‌ లేకుండా చూడాలంటూ సోమేశ్‌కుమార్‌తో పాటు కాశీవిశ్వేశ్వర్‌రావు, శివరాం ప్రసాద్‌ సూచించినట్లు తేలింది. దాంతో.. అప్పట్లోనే కాశీవిశ్వేశ్వర్‌రావు, శివరాంప్రసాద్‌కు మెమోలు జారీ చేశారు. కాగా.. ఫిబ్రవరి 22న ‘ఆంధ్రజ్యోతి’ ఈ కుంభకోణాన్ని వెలికితీయడంతో.. మాజీ సీఎస్‌ సోమేశ్‌ దీనిపై విచారణ జరపొద్దంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. సోమేశ్‌కుమార్‌ సీఎస్‌గా ఉన్నప్పుడు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి రావడంతో.. అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు ఈ కుంభకోణాన్ని గుర్తించారు.

Updated Date - Jul 29 , 2024 | 09:19 PM