Share News

Baby in Danger: దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:55 AM

అప్పుడే పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులే చెట్ల పొదల్లో పడేసిన హృదయ విదారకర ఘటన మేడ్చల్ మండలం గౌడవెల్లిలో వెలుగు చూసింది. పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీ దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే చిన్నారి అరుపులు విన్న ఓ ఆటో డ్రైవర్.. గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో బాలికను రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Baby in Danger: దారుణం.. చెట్ల పొదల్లో పసికందు..

మేడ్చల్: అప్పుడే పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులే చెట్ల పొదల్లో పడేసిన హృదయ విదారకర ఘటన మేడ్చల్ మండలం గౌడవెల్లిలో వెలుగు చూసింది. పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీ దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే చిన్నారి అరుపులు విన్న ఓ ఆటో డ్రైవర్.. గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో బాలికను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం విచారణ చేపట్టి తల్లిదండ్రులను గుర్తించారు. వారు చెప్పిన విషయాలు విని స్థానికులు, అధికారులు షాక్‌కు గురయ్యారు.


ఇలా పడేశారు..

మేడ్చల్ మండలం గౌడవెల్లి సమీపంలోని స్టార్ పౌల్ట్రీ ఫామ్‌లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజయపూర్‌కు చెందిన తులసి, సంతోశ్ దంపతులు ఆరేళ్లుగా వలస కూలీలుగా పనిచేస్తున్నారు. తులసి గర్భిణి కావడంతో భర్త సంతోశ్ వైద్యపరీక్షల నిమిత్తం ఆమెను సోమవారం రోజున మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. పరీక్షల అనంతరం వారు తిరిగి పౌల్ట్రీఫామ్‌కు వెళ్తుండగా ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో మార్గమధ్యలోనే పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో శిశువును ఓ కాగితంలో చుట్టేసిన తల్లిదండ్రులు రోడ్డుపక్కన ఉన్న ముళ్ల పొదల్లో పడేసి పౌల్ట్రీఫామ్‌కు వెళ్లిపోయారు.


గుర్తించిన ఆటోడ్రైవర్..

కాగా గౌడవెల్లి రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లున్న ఓ ఆటో డ్రైవర్‌కు చిన్నారి ఏడుపు వినిపించింది. శిశువు ఏడుపు విన్న ఆటో డ్రైవర్ పొదల మధ్యకు వెళ్లి చూశాడు. అక్కడ చీమలు కొరికి, ముళ్లు గుచ్చుకుని రక్తపు మడుగులో అల్లాడుతున్న బాలికను గుర్తించాడు. విషయాన్ని వెంటనే స్థానికులు, గ్రామ కార్యదర్శి మహిపాల్ రెడ్డికి తెలిపాడు. దీంతో కార్యదర్శి సిబ్బందితో సహా ఘటనా స్థలానికి వెళ్లి ముళ్లపొదల మధ్య గాలించగా రక్తపు మడుగులో శిశువు రోదిస్తూ కనిపించింది. అనంతరం స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశావర్కర్‌ని రప్పించి శిశువును పొదల నుంచి బయటకి తీశారు. చిన్నారికి విపరీతంగా ముళ్లు గుచ్చుకోవడం, చీమలు కుట్టడాన్ని గమనించి చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.


నిందితుల మాటలకు షాక్..

అయితే శిశువును ఆస్పత్రికి చేర్చిన అనంతరం స్థానికులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహిపాల్ రెడ్డి పాపని ముళ్లపొదల్లో ఎవరు పడేశారో ఆరా తీశారు. చిన్నారిని పౌల్ట్రీఫామ్‌‌లో పనిచేస్తున్న తులసి ఆమె భర్త సంతోశ్ పడేసినట్లు కొంతమంది స్థానికుల ద్వారా తెలుకున్నారు. అనంతరం వారి వద్దకు వెళ్లి గట్టిగా నిలదీశారు. దీంతో వారు శిశువు తమదేనని ఒప్పుకున్నారు. వెంటనే తులసిని బిడ్డతోపాటు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అనంతరం సంతోశ్‌ను గ్రామస్థులంతా మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. కాగా బిడ్డ చనిపోయిందనుకుని ముళ్ల పొదల్లో వదిలేశామని, పాప బతికుందని అధికారులు తెలపడంతో పెంచుకుంటామని దంపతులు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Traffic Restrictions: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో ఇవాళ, మరో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad: హాస్టల్‌కు వెళ్లడం ఇష్టంలేక ముంబై రైలు ఎక్కారు..

Updated Date - Sep 03 , 2024 | 11:00 AM