Share News

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:52 AM

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు.

Hyderabad: ఏడుగురు ఎమ్మెల్యేల డుమ్మా..

  • హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ భేటీకి గైర్హాజరు

  • 15 మంది కార్పొరేటర్లూ.. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో

  • వ్యూహంపై సమావేశం ఒక రోజు ముందే

  • ఎమ్మెల్యేలకు సమాచారం ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది ఏడుగురే

  • నేడు కౌన్సిల్‌కు వచ్చేది ఎంతమందో?

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హాజరయ్యారు. కండువాల మార్పిడి సీజన్‌ నడుస్తోన్న సమయంలో ఒకరోజు ముందు సమాచారమిచ్చినా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోనే ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాలేదు. శనివారం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరుగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నమే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు సమావేశానికి రావాలని సమాచారం అందించారు.


పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా హాజరవ్వాలని మొదట అనుకున్నా ఢిల్లీ జైలులో ఉన్న కవిత బెయిల్‌ పిటిషన్‌పై న్యాయవాదులతో చర్చించేందుకు గురువారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. దీంతో శ్రీనివాస్‌ యాదవ్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది. మీటింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి కొద్ది మందే రావడంతో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ఫోన్లు చేసి మరీ రప్పించారు. కాలేరు వెంకటేష్‌, సుధీర్‌రెడ్డి ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. మరో ఏడుగురు అసలే రాలేదు. ప్రజా సమస్యలపై కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీని నిలదీయాలని, ఎమ్మెల్యేలూ కౌన్సిల్‌కు హాజరు కావాలని శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రె్‌సలో చేరిన మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డిలపై అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే, జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం కౌన్సిల్‌ కొలువుదీరిన నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో విరమించుకున్నారు.


కారు దిగుతారా?

రాష్ట్ర రాజధాని పరిధిలో బీఆర్‌ఎ్‌సకు 14 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ఏడుగురు శక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి రాలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 నియోజక వర్గాలకుగాను 16 బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రె్‌సలో చేరారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరుగగా కాంగ్రెస్‌ గెలుచుకుంది. దీంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 14కు తగ్గింది. వీరిలోనూ కొందరు కాంగ్రె్‌సలోకి చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యేకు చేరేందుకు కాంగ్రెస్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు సమాచారం. ముహుర్తం చూసుకొని చేరతారని అంటున్నారు. నగరం మధ్యలోని మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.


స్థానిక కాంగ్రెస్‌ నేతల అభ్యంతరంతో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లోకి వెళ్లిపోయారని, అక్కడ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తిరగడం లేదు. పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేక్‌ తిరుమలలో ఉండగా.. అరెకపూడి గాంధీ సొంత పనిపై నిజామాబాద్‌కు వెళ్లానని పార్టీ నేతలకు సమాచారమిచ్చారు. కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్‌ బలం 56గా ఉండేది. ప్రస్తుతం 47కు తగ్గింది. కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సంఖ్య బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి చేరికలతో మూడు నుంచి 19కి పెరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లలో ఎంతమంది శనివారం నాటి సమావేశానికి హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది.


వచ్చిన ఎమ్మెల్యేలు

  • తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (సనత్‌నగర్‌),

పద్మారావు (సికింద్రాబాద్‌), ప్రకా్‌షగౌడ్‌ (రాజేంద్రనగర్‌), సుధీర్‌రెడ్డి(ఎల్‌బీనగర్‌), మాగంటి గోపినాథ్‌(జూబ్లీహిల్స్‌), ముఠా గోపాల్‌ (ముషీరాబాద్‌), కాలేరు వెంకటే్‌ష(అంబర్‌పేట)


రాని ఎమ్మెల్యేలు

  • అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), మాధవరం

కృష్ణారావు(కూకట్‌పల్లి), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్‌), మర్రి రాజశేఖర్‌రెడ్డి(మల్కాజ్‌గిరి), కేపీ వివేకానందగౌడ్‌(కుత్బుల్లాపుర్‌), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు)

Updated Date - Jul 06 , 2024 | 02:52 AM