Araku Valley: 12న అరకులోయకు సుప్రీం జడ్జీల బృందం
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:06 AM
ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు.

సీజే, 25 మంది న్యాయమూర్తులు కూడా..
అరకులోయ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు. న్యాయమూర్తుల పర్యటన ఏర్పాట్లపై అల్లూరి జిల్లా జేసీ అభిషేక్ గౌడ, పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సోమవారం జిల్లా అడిషనల్ జడ్జి రత్నకుమార్తో కలిసి ఇక్కడి పున్నమి రిసార్టులో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక రెవెన్యూ, పోలీస్, టూరిజం అధికారులకు పలు సూచనలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టి్సతోపాటు 25 మంది న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరి పదిన్నర గంటలకు అరకులోయ చేరుకుంటారని జేసీ, పీవో తెలిపారు. హరిత వేలీ రిసార్టులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శించి విశాఖపట్నం వెళతారన్నారు. న్యాయమూర్తుల రాక నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల నిమిత్తం ఒకరోజు ముందుగానే పర్యాటక ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.