కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. కంటైన్‌మెంట్ జోన్లుగా 7 గ్రామ పంచాయతీలు

ABN , First Publish Date - 2023-09-13T15:18:26+05:30 IST

కేరళలో గడిచిన 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. కంటైన్‌మెంట్ జోన్లుగా 7 గ్రామ పంచాయతీలు

కేరళలో గడిచిన 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని బడులు, ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేయించారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. వ్యాధి గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సోకుతుందని.. వ్యాధి వ్యాప్తి తక్కువగానే ఉన్నా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) బృందాలు కేరళకు చేరుకుని, వైరస్ పై టెస్టులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.

కోజికోడ్ జిల్లా కలెక్టర్ గీత మాట్లాడుతూ.. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు చెప్పారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు 43 వార్డులోని ప్రజలు బయటకి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అవసరమైన వస్తువులు, మందులు అమ్మే షాపులు మాత్రమే ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉంటుందని వివరించారు. నిత్యావసరాలు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పబ్లిక్ మాస్క్ లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని గీత సూచించారు. ప్రభుత్వ సంస్థలు. విద్యాలయాలు, అంగన్ వాడీలు మూసేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సూచిస్తున్న ఆరోగ్య నిబంధనల్ని ప్రజలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-13T16:28:52+05:30 IST