Sajjanar: వాటిని అస్సలు నమ్మొద్దు.. ప్రజలకు సజ్జనార్ కీలక అలెర్ట్ !.

ABN , First Publish Date - 2023-01-19T17:27:14+05:30 IST

అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ (Q Net Scam Alert) లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (CV Sajjanar) ప్రజలను అప్రమత్తం చేశారు.

Sajjanar: వాటిని అస్సలు నమ్మొద్దు.. ప్రజలకు సజ్జనార్ కీలక అలెర్ట్ !.

హైదరాబాద్: అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ (Q Net Scam Alert) లాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వలలో చిక్కుకోవద్దని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ప్రజలను అప్రమత్తం చేశారు. అవి మోసపూరిత సంస్థలని గుర్తించాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) నియంత్రణలో లేని సంస్థలను అసలు నమ్మొద్దని ప్రజలను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. గొలుసుకట్టు సంస్థలకు ఎలాంటి అనుమతులుండవని పేర్కొన్నారు. బ్యాంకర్ల కంటే ఎక్కువగా వడ్డీ ఇవ్వడం ఏ సంస్థకూ సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. పెట్టుబడి పెట్టాలంటే ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాటున క్యూనెట్ సంస్థ (Q Net) గొలుసుకట్టు పద్ధతిలో రూ.వేల కోట్లను అమాయకుల నుంచి వసూలు చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సజ్జనార్ హెచ్చరించారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా క్యూనెట్ సంస్థకు చెందిన 36 బ్యాంక్ ఖాతాల్లోని రూ.90 కోట్ల నగదును సీజ్ చేసిందని ఆయన ప్రస్తావించారు. అందుకే.. మోసపూరితమైన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల మాయలో పడొద్దన్నారు. ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఈ గొలుసుకట్టు సంస్థల వల్ల దేశ ఆర్థిక పరిస్థితే కాక.. మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలన్నీ క్యూనెట్ మోసపూరితమైన సంస్థ అని తేల్చాయని చెప్పారు. ఎంఎల్ఎం కంపెనీల మోసాలు ఏదో ఒక రోజు బయటపడతాయని, వాటిపై రాష్ట్ర పోలీసులే కాక.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తాయన్నారు. అలాంటి మోసపూరిత స్కీమ్‌లతో ప్రమేయమున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు ఉంటాయని సజ్జనార్ హెచ్చరించారు.

కాగా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ పనిచేసిన కాలంలో క్యూనెట్ మోసాలను ఆయన సీరియస్‌గా వ్యవహరించారు. కేసు నమోదు చేసి.. దేశవ్యాపంగా దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు, క్యూనెట్ సంస్థను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీ ష్రాప్, పూజహెగ్డే, షారుఖ్ ఖాన్‌లకు 2019లో నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో మొత్తంగా 500 మందికి సైబరాబాద్ పోలీసులు అప్పట్లో నోటీసులు జారీ చేయడం గమనార్హం. తాజాగా క్యూనెట్ సంస్థ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో సజ్జనర్ స్పందించారు. క్యూనెట్ లాంటి మోసపూరిత గొలుసుకట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అనేకం ఉన్నాయని, వాటి మాయలో పడొద్దని సూచించారు. ఎంఎల్ఎం కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Updated Date - 2023-01-19T21:08:25+05:30 IST