Share News

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

ABN , Publish Date - Sep 08 , 2024 | 08:51 AM

ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండ్రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్ కర్ పుండ్కర్ తెలిపారు. మత్స్యకారులు ఎవ్వరూ మూడ్రోజులపాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంత అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా వరదల్లో చిక్కుకుని అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వెంటనే 08942-240557కు ఫోన్ చేయాలని కలెక్టర్ పుండ్కర్ సూచించారు.


మరోవైపు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఉభయ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. వర్షాల వల్ల ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక అధికారులకు తెలియజేయాలని చెప్పారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. చేపట వేటకు వెళ్లకుండా రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులు, వంకలు, నదులు వంటి ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.


మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో పడుతున్న వానలకు కృష్ణానదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. పులిచింతల, నాగార్జున సాగర్ డ్యామ్‌లకు వరదనీటి ప్రవాహం పెరగడంతో దిగువలకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం బ్యారేజ్‌కు 3.82లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 65గేట్లు ఎత్తి మెుత్తం నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పెద్దఎత్తున వదలడంతో బ్యారేజ్ దిగువ గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.


భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.86లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.09లక్షల క్యూసెక్కులుగా ఉందని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులుగా ఉందని వెల్లడించారు. అలాగే పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 2.75లక్షలు కాగా.. ఔట్ ఫ్లో 2.97లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: సహాయకచర్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Updated Date - Sep 08 , 2024 | 09:15 AM