Share News

GHMC: 5 నుంచి 15కు.. జీహెచ్‌ఎంసీలో పెరగనున్న కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్య

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:49 AM

జీహెచ్‌ఎంసీ(GHMC)లో కోఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెరగనుంది. ఇప్పటి వరకు ఉన్న ఐదుగురు సభ్యుల సంఖ్యను 15కు పెంచుతూ సవరించిన చట్టానికి గవర్నర్‌(Governor) తాజాగా ఆమోదముద్ర వేశారు.

GHMC: 5 నుంచి 15కు.. జీహెచ్‌ఎంసీలో పెరగనున్న కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్య

- జనరల్‌ కేటగిరీలో 9 మంది, మైనార్టీ కోటాలో ఆరుగురు

- చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం

- త్వరలో దరఖాస్తుల స్వీకరణ

- ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశంలో ఎంపిక

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో కోఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెరగనుంది. ఇప్పటి వరకు ఉన్న ఐదుగురు సభ్యుల సంఖ్యను 15కు పెంచుతూ సవరించిన చట్టానికి గవర్నర్‌(Governor) తాజాగా ఆమోదముద్ర వేశారు. ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందలేదని, వివరాలు వచ్చిన అనంతరం సభ్యుల ఎంపికకు కసరత్తు ప్రారంభిస్తామని బల్దియా వర్గాలు పేర్కొన్నాయి. 100 వార్డులున్న ఎంసీహెచ్‌ను 150 డివిజన్లతో 2007లో జీహెచ్‌ఎంసీగా ఏర్పాటు చేసినా మునుపటిలా ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యులకే పరిమితం చేశారు. చట్టప్రకారం మొత్తం వార్డుల సంఖ్యలో పది శాతం వరకు కో ఆప్షన్‌ సభ్యులు ఉండే అవకాశముంది.

ఇదికూడా చదవండి: Secunderabad: జీహెచ్‌ఎంసీలో విలీనం వల్ల కంటోన్మెంట్‌కు నష్టాలే ఎక్కువ..


ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో ఐదుగురు సభ్యుల సంఖ్యను 15కు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టం 1955, సెక్షన్‌ 5 (1-బీ, 1-సీ)ను సర్కారు సవరించారు. సభ్యుల సంఖ్య పెంపునకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, ఉభయసభలూ ఆమోదించాయి. గత గవర్నర్‌ తమిళిసై ఆ బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రస్తుత గవర్నర్‌ బిల్లులను ఆమోదించారు. దీంతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో 15 మంది కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు మార్గం సుగమమైంది. తాజా నిర్ణయం నేపథ్యంలో అర్హత, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారు. అర్హత ఉన్న వారి పేర్లను కౌన్సిల్‌లో ప్రకటిస్తే ఎక్స్‌అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు చేయి ఎత్తి మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఎక్కువ సభ్యుల మద్దతు ఉన్న వారిని ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.


సభ్యులు ఇలా..

- 15 మంది కో ఆప్షన్‌ సభ్యుల్లో సాధారణ కేటగిరీలో తొమ్మిది మందిని, మైనార్టీ కోటాలో ఆరుగురిని ఎన్నుకునే అవకాశముంది.

- జనరల్‌ కేటగిరీలోని తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు ఉండాలి. మైనార్టీ కోటాలో ముగ్గురు మహిళలు తప్పనిసరి.

- గతంలో మేయర్‌, మాజీ కార్పొరేటర్లుగా పనిచేసిన.. పురపాలక శాఖలో గెజిటెడ్‌ హోదాలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన వారు కూడా కో ఆప్షన్‌ సభ్యులుగా అర్హులే.

- సామాజిక సేవ, పురపాలనలో భాగస్వాములైన వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

- కో ఆప్షన్‌ సభ్యులకు కౌన్సిల్‌లో ఓటు హక్కు ఉండదు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 09:49 AM