Share News

Hyderabad: గత ప్రభుత్వ ‘విద్యుత్తు’ నిర్ణయాలపై కమిషన్‌కు ఆరే ఫిర్యాదులు..

ABN , Publish Date - May 28 , 2024 | 05:08 AM

గత బీఆర్‌ఎస్‌ సర్కారు పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన నష్టం, ఈ అంశాల్లో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన బహిరంగ ప్రకటనకు... కేవలం ఆరుగురు మాత్రమే స్పందించారు.

Hyderabad: గత ప్రభుత్వ ‘విద్యుత్తు’ నిర్ణయాలపై కమిషన్‌కు ఆరే ఫిర్యాదులు..

  • నోటీసులకు స్పందించని అర్వింద్‌కుమార్‌

  • ఇక ప్రత్యక్ష విచారణ నిర్వహించాలని జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ నిర్ణయం

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ సర్కారు పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన నష్టం, ఈ అంశాల్లో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన బహిరంగ ప్రకటనకు... కేవలం ఆరుగురు మాత్రమే స్పందించారు. 11 రోజుల కిందట కమిషన్‌ ఈ ప్రకటన జారీ చేసింది. సంబంధిత అంశాలపై అవగాహన, అనుభవం, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, సంస్థలు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరగా.. స్పందన కరువయింది.


విచారణ కమిషన్‌కు పంపించే విజ్ఞాపనల్లో వ్యక్తులపై ఎలాంటి రాజకీయపరమైన ఆరోపణలు చేయరాదని, ఎవరైనా కమిషన్‌ ముందు హాజరై మౌఖికంగా ఆధారాలు సమర్పించాలని భావిస్తే, ఏ విషయమై వారు హాజరుకావాలని కోరుకుంటున్నారో తెలియజేయాలని.. న్యాయ విచారణకు ఆ విషయంతో ఉన్న సంబంధం, సమయ లభ్యత ఆధారంగా ఈ విజ్ఞప్తులపై నిర్ణయం తీసుకుని సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తామని కమిషన్‌ పేర్కొంది. అయితే స్పందించడానికి 10 రోజులు మాత్రమే గడువు ఇవ్వడంవల్లే పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ ఒప్పందంలో భాగస్వాములైన మొత్తం 28 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు కమిషన్‌ నోటీసులు ఇవ్వగా... వారిలో 25 మంది దాకా అధికారులు మాత్రమే లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.


ఇంధనశాఖ మాజీ సీఎస్‌ అర్వింద్‌కుమార్‌ మాత్రం కమిషన్‌ నోటీసుకు స్పందించలేదు. దీంతో.. ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలంటూ కమిషన్‌ ఆయనకు సమన్లు పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా.. కమిషన్‌ ఇక ప్రత్యక్ష విచారణను చేపట్టనుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు మేరకు.. జూన్‌ నెలాఖరుకల్లా నివేదికను అందించాలని జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.

Updated Date - May 28 , 2024 | 05:08 AM