TDP vs YSRCP: ఆ మందులు వికటించాయా.. ఆందోళనకరంగా జగన్ మాటలు
ABN , Publish Date - Feb 20 , 2025 | 03:17 PM
TDP Leaders: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని.. ప్రతిపక్ష నేత కాదని అన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 20: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ భద్రతపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రులు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamshetti Subhash) మాట్లాడుతూ.. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే అని.. ప్రతిపక్ష నేత కాదన్నారు. జగన్కు జైలు యాత్రలతో ఖైదీలు, వాళ్ళ కుటుంబ సభ్యులలో మంచి క్రేజ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. జగన్కు లండన్ మందులు వికటించినట్టున్నాయని.. మగాళ్ళ అందాలు, బట్టలిప్పడం లాంటి మాటలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి వాసంశెట్టి అన్నారు.
భద్రత లేదంటూ డ్రామాలు: మంత్రి బాలవీరాంజనేయ
ప్రకాశం: ఎన్నికల కోడ్ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని.. జగన్ పర్యటనకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ముందుగానే చెప్పారని మంత్రి బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల కమిషన్ను ధిక్కరించి మిర్చియాడ్కు జగన్ వెళ్లారన్నారు. తనకు భద్రత లేదని జగన్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మిర్చియార్డ్లో ఉన్న మిరపకాయల బస్తాలు కూడా దొంగతనం చేశారన్నారు.
ప్రజాస్వాయ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి విలువలు గౌరవం ఉందని స్పష్టం చేశారు. జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదన్నారు. జగన్పై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ బ్లూ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం నడిపారని మండిపడ్డారు. జగన్ ఎన్ని పుస్తకాలు పెట్టుకున్నా ఇబ్బంది లేదన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ తాము ముందుకెళ్తున్నామని మంత్రి చెప్పారు.
చూస్తూ ఊరుకోం.. జాగ్రత్త: ప్రత్తిపాటి
పల్నాడు: అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి అడ్డగోలుగా రైతుల భూములు లాక్కున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రైతుల గురించి జగన్ రెడ్డి మాట్లాడటం రాజకీయ డ్రామాలో భాగమే అని అన్నారు. మిర్చి గిట్టుబాటు ధర రూ.7 వేలుగా ప్రకటించి జీవో ఇచ్చింది జగన్ కాదా అని ప్రశ్నించారు. నేడు ఏ ముఖం పెట్టుకొని మిర్చిరైతులు నష్ట పోతున్నారని గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అరకొరగా ధాన్యంకొని, రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. రైతులపై జగన్ రెడ్డి కపట ప్రేమ చూపడం రాజకీయ స్వలాభం కోసమే అని విమర్శించారు. అసెంబ్లీలో గొంతెత్తని వ్యక్తి, అన్నదాతల గురించి రోడ్లపై హంగామా ఎందుకని నిలదీశారు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఎలాంటి భద్రత కల్పించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పనిలేనప్పుడు రోడ్లెక్కి.. నోటికొచ్చినట్టు మాట్లాడిపోతాం అంటే చూస్తూ ఊరుకోమని ప్రత్తిపాటి పెల్లారావు హెచ్చరించారు.
క్షమాపణ చెప్పాల్సిందే: శ్రీనివాసరావు
బాపట్ల: గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రోజుకొకరు పార్టీని వీడుతున్నారని.. ఆందోళనలో ఉన్న జగన్ రెడ్డి గుంటూరులో బల ప్రదర్శన చేపట్టారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అల్లరి మూకలతో జగన్ రెడ్డి మిర్చి యార్డ్లో రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. ఆరుగాలం పండించి యార్డ్కు తెచ్చిన మిర్చి పంటను తొక్కి నాశనం చేశారని ఆగ్రహించారు. యార్డ్లో మిర్చి నష్టపోయిన రైతులకు జగన్ రెడ్డి క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Robbery: హైటెక్ చోరీ.. ఖంగుతిన్న పోలీసులు
Read Latest AP News And Telugu News