Telangana Land Value : భూముల విలువలకు రెక్కలు
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:45 AM
రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కారు నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400 శాతం వరకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ

100 నుంచి 400% పెంపు..! ఏప్రిల్ 1 నుంచి అమలు?
ప్రాంతాలను బట్టి సవరణలు.. సగటున 60% వరకు పెంచే యోచన
మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40% రాబడికి ప్రణాళిక
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కారు నిర్ణయించింది. కొన్ని చోట్ల అవసరమైతే 100 నుంచి 400 శాతం వరకు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై కసరత్తు చేసిన అధికారులు.. పలు సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త మార్కెట్ విలువలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆరేళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15-30 శాతం, స్థలాల విలువను ఒకటి నుంచి నాలుగు రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెంచితే రియల్ఎస్టేట్ రంగం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో ఏ వర్గానికీ ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మదింపు చేసి, విలువలు పెంచాలని సీఎం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున రూ.3200 ఉంది. దీన్ని 60 శాతం మించకుండా పెంచాలని సర్కారు భావిస్తోంది. అంటే చదరపు అడుగు ధర రూ.5120 వరకు కానుంది. ప్రాంతాలను బట్టి ఈ విలువలో మార్పులు ఉంటాయి. హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర రూ.26700గా ఉంది. ఇదే వాణిజ్య స్థలమైతే గజం రూ.44900 ఉంది. నార్సింగ్లో గజం రూ.23800, మణికొండలో రూ.23900, రాయదుర్గంలో రూ.44900, బుద్వేల్లో రూ.10200గా ఉంది. ఇటీవల బుద్వేల్లో ఎకరా రూ.20 కోట్లు పలికింది. మహేశ్వరంలో గజం రూ.2100, వాణిజ్య స్థలం రూ.10,200 చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల రూ.2100 ఉన్న విలువను 300 నుంచి 400 శాతం పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా రూ.3 వేల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించనున్నారు. పుస్తక విలువ భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇక వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి 100 నుంచి 200 శాతంపైగా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
గజం ధర రూ.1000 ఉంటే దాన్ని రూ.3 వేల వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదాహరణకు శేరిలింగంపల్లి రెండు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఉంది. అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ గజం ధర రూ.26,700గా ఉంది. దీన్ని రూ.50-60 వేల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మోకిలాలో గజం రూ.2300 ఉంది. వాస్తవ విలువకు, రిజిస్ట్రేషన్ శాఖ విలువకు అసలు పొంతనే లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుత విలువను కనీసం 400 శాతం పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ఇక్కడ హుడా లేఅవుట్లో వేసిన వేలంపాటల్లో గజం ధర రూ.50 వేలు పలికింది. ఇలాంటి చోట్ల గజం ధర రూ.10 వేల వరకు పెంచాలని చూస్తున్నారు. 2023-24 లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఫ్లాట్ల నుంచి వచ్చేది 35.1 శాతం(రూ.5,115 కోట్లు) కాగా, ప్లాట్ల నుంచి 22.8ు (రూ.3322 కోట్లు)గా ఉంది. ఇక ఇళ్ల రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5ు (రూ.2838 కోట్లు), వ్యవసాయ భూములు 11.4ు (రూ.1668 కోట్లు), నాన్-రిజిస్టర్ 11.3ు (రూ.1645 కోట్లు)గా ఉంది. మొత్తం 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై 40 శాతం అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: ఆప్కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
For Telangana News And Telugu News