Share News

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:38 AM

విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

  • విశాఖకు జోన్‌ ఇవ్వకుండానే ఒడిశాలోని రాయగడకు డివిజన్‌

  • డీఆర్‌ఎం కార్యాలయం నిర్మాణానికి టెండర్‌

  • వాల్తేరు డివిజన్‌ రద్దు దిశగా అడుగులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019ఎన్నికల ముందు జోన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తూర్పు కోస్తా జోన్‌ నుంచి వాల్తేరు డివిజన్‌ను తప్పించి, దక్షిణ కోస్తాలో కొన్ని డివిజన్లతో విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌ పెడతామని ప్రకటించారు.

2020-21 బడ్జెట్‌లోనే జోన్‌ కార్యాలయం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అయితే జోనల్‌ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములు ఏపీ ప్రభుత్వం (జగన్‌ సర్కారు) ఇవ్వడం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో అనేకసార్లు ఆరోపించారు. తాజాగా జోన్‌ సమస్యలు పరిష్కారం అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఇటీవల తెలిపారు.

అయితే తూర్పు కోస్తా రైల్వే కొత్తగా ఏర్పాటు చేయబోయే రాయగడ డివిజన్‌ కోసం రాయగడలో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం, సిబ్బందికి క్వార్టర్లు, సర్వీసు భవనం నిర్మించడానికి శనివారం టెండర్లను ఆహ్వానించింది. ఇది చూసి ఉత్తరాంధ్ర రైల్వే ప్రయాణికులు మరోసారి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.


  • జోన్‌ ఏర్పాటైతేనే... డివిజన్‌

విశాఖలో కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే వాల్తేరు డివిజన్‌లో ఉన్న కొన్ని ప్రాంతాలను తీసేసి, అటు ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా ‘రాయగడ డివిజన్‌’ ఏర్పాటు చేయాలనేది ఓ ప్రతిపాదన. కొత్త డివిజన్‌ ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

కానీ ఇప్పుడు రాయగడలో డీఆర్‌ఎం కార్యాలయ సముదాయం నిర్మాణానికి సెప్టెంబరు 24లోగా టెండర్లు సమర్పించాలని ప్రకటించారు. అంటే రాయగడ డివిజన్‌ ఏర్పాటు, వాల్తేరు డివిజన్‌లో కొన్ని ప్రాంతాలను అందులో కలపడం ఖాయమని తేలిపోయింది.

ఒడిశాకు సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్న రైల్వే పెద్దలు విశాఖ జోన్‌ విషయంలో ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


వాల్తేరు డివిజన్‌ రద్దు!

కొత్త జోన్‌ కార్యాచరణ ప్రక్రియ ముందుకు సాగాలంటే... ముందు విభజన అంశాల్లో భాగంగా ‘వాల్తేరు రైల్వే డివిజన్‌’ రద్దు చేయాలి. ఈ డివిజన్‌లో విశాఖపట్నం, విజయనగరం, చీపురుపల్లి వరకు విజయవాడ డివిజన్‌లో కలిసిపోతాయి. విజయవాడ డివిజన్‌ దక్షిణ కోస్తా జోన్‌లోకి వస్తుంది.

ఇక వాల్తేరు డివిజన్‌లో మిగిలిన ఒడిశా ప్రాంతాలు కోరాపుట్‌, రాయగడ, కిరండోల్‌ వంటివి కొత్తగా ఏర్పాటయ్యే ‘రాయగడ డివిజన్‌’లోకి వెళ్లిపోతాయి. ఈ మేరకు రాయగడలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త జోన్‌ పనులు మొదలవుతాయని అంటున్నారు. అయితే వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్‌ కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీలు కూడా అదే మాట ఢిల్లీ పెద్దలకు చెప్పారు.

Updated Date - Aug 26 , 2024 | 05:38 AM