Share News

TG News: హైదరాబాద్‌లో ఘనంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాల కార్యక్రమం..

ABN , Publish Date - Oct 06 , 2024 | 08:23 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

TG News: హైదరాబాద్‌లో ఘనంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాల కార్యక్రమం..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఉతీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్‌గా ఎంపికైన 1,473మందికి సీఎం రేవంత్, మంత్రులు నియామకపత్రాలు అందజేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంకితభావంతో పని చేయాలని, ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగం పొందామనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.." అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్‌‌గా ఎంపికైన మీరంతా నేడు నియామ‌క ప‌త్రాలు అందుకున్నారు. అపాయిట్మెంట్ ఆర్డర్స్ పొందిన మీ అంద‌రికీ శుభాకాంక్షలు చెప్తున్నా. ద‌స‌రాకు ముందే జరుగుతున్న అతి పెద్ద పండ‌గ ఇది. ఈ కార్యక్రమం మీ అంద‌రికీ జీవితాంతం గుర్తుండే సంద‌ర్భం. ఎన్నో ల‌క్ష్యాల‌తో చ‌దువుకుని నిబద్ధత, అంకితభావంతో ఉద్యోగాలు సాధించారు. అంతే అంకితభావంతో ప‌నిచేస్తే లక్ష్యాల‌ను చేరుకుంటారు. ప‌ని చేసే చోట మీదైన మార్పు చూపుతూ ప‌నిచేయాలి. మంచిగా ప‌ని చేసి ప్రజాపాలనకు మంచి పేరు తీసుకురావాలి. వృత్తి బాధ్యతలను స‌రిగా నిర్వర్తిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. మీ ప‌నిత‌నం శాశ్వతంగా నిలిచిపోయేలా సేవ‌లందించాలి. ఉద్యోగిగా ప్రజలకు చేసిన సేవే మీకు శాశ్వత గ‌ుర్తింపు తెస్తుంది. అనేక చిక్కుముడులు విప్పుతూ వ‌రుస నియ‌మ‌కాలు చేప‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా ముంద‌స్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని చెప్పారు.


ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె.కేశవరావు, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 08:31 PM