Share News

Padi Kaushik Reddy: ఉప ఎన్నికలు వస్తాయని ఆ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు..

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:36 PM

తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు, చీటర్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Padi Kaushik Reddy: ఉప ఎన్నికలు వస్తాయని ఆ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు..

హైదరాబాద్: తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు, చీటర్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఇవాళ(బుధవారం) అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చిందని, చర్యలు తీసుకోకుంటే సుమోటోగా కేసు స్వీకరిస్తామని హైకోర్టు చెప్పిన విషయాన్ని నరసింహాచార్యులకు వివరించారు. కాలయాపన చేయకుండా తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సిగ్గు లేదు. వారు వెంటనే రాజీనామా చేయాలి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనేక పార్టీలు మారారు. ఇకపై ఆయన శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. కడియం శ్రీహరి పచ్చి మోసగాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పొద్దున బ్యాగులు తీసుకుని సాయంత్రాని కల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం శ్రీహరి డిపాజిట్ తెచ్చుకుని చూపించాలి. కాంగ్రెస్‌లో చేరానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్వయంగా మీడియాకు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడైతే తెలంగాణ భవన్‌కు రావాలి. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను రావాలి. గతంలో కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం అయ్యింది" అని అన్నారు.


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసే విధంగా మంత్రి శ్రీధర్ బాబు మాటలు ఉన్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలంటే ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దానం, కడియం, అరికెపూడి మినహా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలపై పిటీషన్ స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు బెంచ్ ఎమ్మెల్యేల అనర్హతపై కాలయాపన వద్దని గతంలో తీర్పు ఇచ్చిందని.. హై కోర్టు తీర్పును శ్రీధర్ బాబు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని దేశం మొత్తం రాహుల్ గాంధీ చెప్తున్న విషయాన్ని కేపీ వివేకానంద గుర్తు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా కూల్చివేతల్లో ఉపయోగించే భారీ యంత్రం ఇదే..

Bandi Sanjay: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పట్టేది..

Bandi Sanjay: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పట్టేది..

Updated Date - Sep 11 , 2024 | 04:44 PM