Share News

TG Govt: టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Aug 31 , 2024 | 06:17 PM

నాగార్జునసాగర్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

TG Govt: టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

నల్లొండ: తెలంగాణ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాగార్జునసాగర్‎ను అన్ని హంగులతో పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ - నాగార్జునసాగర్ ఫోర్ లైన్ రహదారికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్ చుట్టూరా స్కై వాక్ వే.. వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‎ని నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు.


ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం..

దేశ విదేశాల్లోని బుద్దిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ద క్షేత్రాలతో పాటు హుస్సేన్​ సాగర్‎​లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్‎గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్‎​లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డీపీఆర్‎ను పంపించింది. రూ.25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కివ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్​ బుద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో పొందుపరిచింది.


టూరిజం ప్యాకేజీలు..

ఇందులో భాగంగా నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని టూరిజం, స్పిరిచ్యువల్ డెస్టినేషన్ సెంటర్‎గా తీర్చిదిద్దనున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్​ అందాలతో పాటు పరిసరాల్లోని బుద్ధవనాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. నాగార్జున సాగర్​ సందర్శనకు వెళ్లే పర్యాటకులు బ్యాక్ వాటర్ వరకు బోట్‎లో విహారించే ఏర్పాట్లను పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకును ఆకర్షించేందుకు అనువైన టూరిజం ప్యాకేజీలు రూపొందించనున్నారు. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లైన్ రోడ్ నిర్మించనున్నారు. ఈ రహదారికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


స్కై వాక్ వే..

హైదరాబాద్​ హుస్సేన్​సాగర్​ బుద్ధ విగ్రహం చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్‎గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ట్యాంక్​ బండ్​, తెలంగాణ అమరుల జ్యోతి, నెక్లెస్​ రోడ్డు, సంజీవయ్య పార్కు వరకు వలయాకారంలో స్కై వాక్ వే డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‎గా రూపొందించాలని ఆదేశించారు. అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ స్థాయి నమూన డిజైన్లు తయారు చేయించనున్నారు.


పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్​కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సిటీలో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గోల్కొండ చుట్టూ ఉన్న రోడ్లు అన్ని ఇరుకుగా అయ్యాయని, వాటిని విశాలంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి భావించారు. ఆక్రమణలుంటే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయులకు మరో చోట పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Updated Date - Aug 31 , 2024 | 06:38 PM