Share News

TSRTC: మహిళా ప్రయాణికులకు అలర్ట్.. మరో కీలక ప్రకటన చేసిన సజ్జనార్..

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:04 PM

తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం' వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ.

TSRTC: మహిళా ప్రయాణికులకు అలర్ట్.. మరో కీలక ప్రకటన చేసిన సజ్జనార్..
TSRTC Free Bus

హైదరాబాద్, జనవరి 08: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మహిళా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం' వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు ఆర్టీసీ ఎండీ. అంతేకాదు.. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని తెలిపారు.

ఆ కార్డు అంగీకరించబడదు..

అయితే, ఇటీవలి కాలంలో కొందరు తెలివిగా పాన్‌ కార్డు చూపుతున్నారని, అందులో అడ్రస్ ప్రూఫ్ లేనందున.. ఇతర రాష్ట్రాల వారు సైతం ఫ్రీగా జర్నీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం.. కీలక ప్రకటన చేసింది. ఫ్రీ బస్సు ప్రయాణానికి పాన్ కార్డును అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత బస్సు ప్రయాణానికి చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ఎవరైనా పాన్ కార్డు చూపిస్తే బస్సులో టికెట్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఎంత చెప్పినా వినని జనాలు..

ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నారు అధికారులు. అయితే, ఇప్పటికీ కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌లు చూపిస్తున్నారని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని, దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు సజ్జనార్. అంతేకాదు.. వీరి కారణంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. అందుకే.. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ను తీసుకోవాలని కోరారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం కేవలం తెలంగాణ ప్రాంత మహిళలకు మాత్రమే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరారు సజ్జనార్.

జీరో టికెట్ అయినా తీసుకోవాల్సిందే..

''ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరుతున్నాం.' అని ఒక ప్రటకన విడుదల చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Updated Date - Jan 08 , 2024 | 03:33 PM